Author: వర్మ
•8:12 AM
సమస్త చరాచరప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ఓసారి మానవున్ని తన వద్దకు పిలిచి ’నీకేమి కావాలి ?’ అని అడిగాడు.

మానవుడు ఇలా బదులిచ్చాడు - ’నేను బాగా పైకి రావాలి సుఖశాంతులతో తులతూగాలి, లోకమంతా నన్ను పొగడాలి’.

బ్రహ్మదేవుడు మానవుని ముందు రెండు సంచులు వుంచాడు. ఇలా అన్నాడు - ’ ఈ రెండు సంచుల్ని తీసుకో, ఒక సంచిలో పొరుగువాని తప్పులున్నాయి. దాన్ని వీపు మీద వేసుకో. దాన్ని ఎప్పుడు విప్పకుండా ఉండాలి, నీవు చూడకూడదు, ఇతరులకు చూపించకూడదు. రెండో సంచిలో నీ తప్పులున్నాయి. దాన్ని నీ ఎదుట వేలాడ తీసుకుని వుంచు. దాన్ని పదే పదే విప్పి చూస్తూ ఉండు.’

మానవుడు రెండు సంచులను తీసుకున్నాడు. కాని అతడు ఓ పొరపాటు చేసాడు. తన తప్పులున్న సంచిని వీపు మీదికి ఎత్తుకున్నాడు. దాని మూతిని గట్టిగా బిగించి ఉంచాడు. పొరుగు మనిషి తప్పులున్న సంచిని ఎదురుగుండా వేలాడదీసాడు. అప్పుడప్పడు దాని మూత విప్పి చూస్తూ ఇతరులకు చూపిస్తూ ఉండేవాడు. దీని వల్ల జరిగింది ఏమిటంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తలకిందులయింది. అతనికి సుఖశాంతులు లభించకపోగా దు:ఖం, అశాంతి ఎక్కువ కాసాగాయి. లోకులు అతన్ని దూషించసాగారు.


ప్రతి మనిషి తన తప్పులు దిద్దుకోవాలి. అప్పుడే అతను పైకి వస్తాడు. అతనికి సుఖశాంతులు లభిస్తాయి. ప్రజలు అతన్ని మనసారా ప్రశంసిస్తారు. నీవు ఇరుగుపొరుగు వారి తప్పులను వేలెత్తి చూపడం మానుకో. నీ తప్పులను తెలుసుకొని దిద్దుకోవడం నేర్చుకో.


నీతి : తమ తప్పులను దిద్దుకునే వాళ్ళే ఉత్తములు.
This entry was posted on 8:12 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: