Author: వర్మ
•5:27 PM


ఇవాళ ఒక కళాశాలను దర్శించాను. అక్కడ ర్యాగింగ్ ను నిరసిస్తూ ఒక పోస్టర్ కనబడింది. వెంటనే నాకు నా పి.జి ప్రారంభపు రోజులు గుర్తుకు వచ్చాయి. నేను పి.జి హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో చేసాను. హాస్టల్ లో మా సీనియర్స్ మేము ఎప్పుడు వస్తామా అని ఎదురుచూస్తూ కూర్చున్నారు. హాస్టల్ లో చేరగానే ర్యాగింగ్ ప్రారంబించారు. ర్యాగింగ్ అంటే పెద్దగా ఏమీ ఉండేది కాదు గానీ మమ్మల్ని నిల్చోబెట్టి పనికి రాని ప్రశ్నలన్నీ అడిగేవారు. హాస్టల్ లోనే ఇలాగ ఉంటుందేమో అనుకుని కాలేజికి వెళితే అక్కడ ఇంకా దారుణం అబ్బాయిలకి అమ్మాయిలు కూడా తోడయ్యి అమ్మాయిలు,అబ్బాయిలు కలిసి ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ఒక అమ్మాయి నేను బాగున్నానా ? అని అడుగుతుంది. అవును బాగున్నావు అంటే వెంటనే పక్కన ఉన్న అమ్మాయి నేను బాగాలేనా ? అని మెలిక పెడుతుంది. లేదు ఇద్దరు బాగున్నారంటే కాదు కాదు ఇద్దరుట్లో ఎవరు బాగున్నారు చెప్పు అని ప్రశ్నిస్తారు. సమాధానం చెప్పలేక మనం పడే అవస్థను చూసి హాయిగా నవ్వుకునేవారు. . . మొదట మూడు రోజులు అన్నీ ఓపికగా సహించాను ఒక రోజు మాత్రం సుమారు నాలుగు గంటలపాటు హాస్టల్ లో నిల్చోబెట్టి పనికి రాని ప్రశ్నలన్నీ సంధించి మొత్తం బుర్ర తినేసారు. ఇంక లాభంలేదనుకుని హైదరాబాద్ లోనే ఉంటున్న మా కజిన్ ఇంటికి వెళ్ళి అక్కడ రెండు,మూడు రోజులు గడిపి వచ్చాను. మా కజిన్ ఇవన్నీ కళాశాల స్థాయిలో సర్వసాధారణమని బూస్టింగ్ ఇచ్చి పంపారు. ధైర్యంగా హాస్టల్ లోకి అడుగు పెట్టేసరికి పరిస్థితి తలక్రిందులయ్యింది. విషయం ఏమిటంటే మా బ్యాచ్మెట్ లలో ఎవరో ఎ.బి.వి.పి వారికి కాంప్లెంట్ ఇచ్చారట. వాళ్ళు ర్యాగింగ్ మానుకున్నారట. సీనియర్స్ ఎవ్వరూ మాతో మాట్లాడలేదు. ఇదంతా ఫ్రెషర్స్ పార్టీ వరకే !! ఫ్రెషర్స్ పార్టీ పూర్తి కాగానే సీనియర్స్ కూడా మాతో క్లోజ్ గా మెలగటం మొదలుపెట్టారు. చాలా విషయాలలో గైడెన్స్ కూడా ఇచ్చారు. నిజంగా ఇంత మంచి వారిపైననా మేము కోప్పడింది అనే విధంగా చేసారు. మొదట్లో వారిపై కోపం కలిగినా నిజంగా వారు కొర్సు పూర్తి చేసుకుని వెళుతుంటే చాలా బాధనిపించింది. మేము సెకండియర్ వచ్చి సీనియర్స్ అయినపుడు మాత్రం మేము ఏ విషయాలతో అయితే ఎక్కువగా బాధపడ్డామో అలాంటి ఇబ్బంది మా జూనియర్స్ కు కలగకుండా చూసుకున్నాం. కేవలం పరిచయాలు, బయోడాటా చెప్పించటంతోనే సరిపుచ్చుకున్నాం. మొత్తానికి నా పి.జి రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. ర్యాగింగ్ అనేది శృతిమించనంత వరకు ఫర్వలేదు. అతి చేయకుండా, తమ తమ హద్దుల్లో ఉండి ఒక మాడరేట్ గా చేసే ర్యాగింగ్ నిజంగా హృదయంలో ఒక తీయని గుర్తుగా కలకాలం నిలచిపోతుంది. అప్పుడు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది....
Author: వర్మ
•6:55 PM
నేను బి.ఎడ్ చేసే సమయంలో ఒక క్రిష్టియన్ పాఠశాలలో టీచింగ్ ప్రాక్టీసు చెయ్యవలసి వచ్చింది. అక్కడ పనిలో పనిగా ఆ పాఠశాలలో పనిచేసే ఒక టీచర్ పరిచయం అయ్యింది. ఒక సారి చర్చలో కృష్ణుడు 16000మంది స్త్రీలను ఎందుకు పెండ్లాడాడు ? అంత రసికుడినా మీరు పూజించేది అని ఆ టీచర్ ఎద్దేవా చేసింది. నాతోపాటు ఉన్న హిందూ మిత్రులంతా తెల్లమొఖం వేసారు. అవును కదా ... అని ఆ టీచర్ తో ఏకీభవించబోయారు.... ఇంతలో నాకు చిన్నప్పుడు నేర్చకున్న పై ప్రశ్నకు సమాధానం స్పురించింది. వెంటనే వారికి ఈ విధంగా సమాధానం చెప్పాను... అదే మీ ముందుంచుతున్నాను...

" నరకాసురుడు అనే రాక్షసుడు 16000మంది స్త్రీలను చెరబట్టి తన చెరసాలలో భందించాడు. అప్పుడు కృష్ణుడు నరకాసురుని చంపి ఆ స్త్రీలందరిని ఆ చెరనుండి విడిపించాడు. అయితే పరపురుషుని చెరలో ఉండి బయటకు వచ్చిన స్త్రీలందరు తమకు సమాజంలో ఎటువంటి విలువ ఉండదని, తమను సమాజం చిన్నచూపు చూస్తుందని, తమకు పెళ్ళిళ్ళు కావని, తమకు చావే శరణ్యం అని కష్ణునితో మొరపెట్టుకున్నారు.

అపుడు కృష్ణుడు వారికి సమాజం నుండి వచ్చే చిన్నచూపు నుండి రక్షించడానికి, వారికి సోషల్ స్టేటస్ ను కల్పించడానికి వారినందరిని పెండ్లాడి పట్టపు రాణులుగా చేసుకున్నాడు. ఇందులో కృష్ణుడు చేసిన త్యాగం ఉంది కానీ అతని స్వార్థం లేదు. " అని ఆవేశంగా చెప్పి ముగించాను. అంతే ఆ మరుక్షణం ఆ టీచర్ అక్కడి నుండి అదృష్యమయ్యింది. నా మిత్రలందరూ నన్ను అభినందించారు.

హరిసేవ లో దుర్గేశ్వర గారు రామాయణం గురించి వ్రాసిన విధానం, విశ్లేషణ చే ప్రభావితమై ఇది రాస్తున్నాను. హిందువులై ఉండి కూడా భిన్నంగా ఆలోచించాలి అనే విచిత్రమైన పోకడలతో సరియైన విధంగా హిందుత్వాన్ని, ఇతిహాసాల్ని అర్థంచేసుకోక విచిత్రమైన వాదనలతో హిందువులలోనే సందేహాలు రేకెత్తించే విధంగా కొందరు వాదిస్తున్నారు. మన ఇతిహాసాల్లో గల ప్రతి సంఘటనకు ఒక విష్లేషణ ఉంటుంది అది సూక్ష్మంగా ఆలోచిస్తేనే తెలుస్తుంది.
Author: వర్మ
•6:41 PM

"అరె మన సార్లకు ఏమయిందిరా ? జీతాలు సరిపోతలేవటనా ? ఇట్ల రోడ్లమీద తిరుగుతున్నరు. " అని తన స్నేహితునితో ఒక యువకుని ప్రశ్న ...
" ఏమో తెలువదిరా మొన్నటినుండి సమ్మె జేస్తుండ్రు. మద్యనే పేపర్లో టీచర్ల జీతాలు పెరిగినయని రాసిండ్రు అయినా ఎందుకు సమ్మె జేస్తుండ్రో .... " అని స్నేహితుని సమాధానం.

అయితే టీచర్లు సమ్మె చేస్తున్నది జీతాలకొరకు కాదని , తమకు ఇంతకుముందే ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే సమ్మె చేస్తున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. బ్లాగు ద్వారా మిత్రులందరికి సమ్మె కారణాలను వివరించదలుచుకున్నాను....

ఉపాధ్యాయుల ప్రధానమయిన డిమాండ్లు మూడు ..... అవి .....

) ఉమ్మడి సర్వీసు నిభందనలు : ఇది చాలా ప్రధానమయిన డిమాండు. ఇది లేకపోవడం వలన విద్యా శాఖలో పెద్ద అనిశ్చితి నెలకొంది. అంటే ఎవరు ఎవరికి బాస్ అవుతారో కూడా తెలియని అనిశ్చితి ఉంది. రూల్స్ లేకపోవడం వలన బదిలీలు, ప్రమోషన్లు లేక ఎక్కడ ఉపాధ్యాయులు అక్కడే నిలిచిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఖచ్చితమయిన డి.. లు, ఎం.. లు లేక ఇన్ చార్జ్ లతో సాగిపోతున్నవి. రిటైరైన ఉపాధ్యాయుల స్థానాల్లో కొత్తవారు నియమింపబడక పోవటం వలన స్థానాలు ఖాళీగా ఉండి విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. అయితే ఉమ్మడి సర్వీసు నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ పై ఆధారపడి ఉన్నది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలయగ్నం కోసం, రెండు రూపాయలకు కిలో బియ్యంకోసం రాత్రికి రాత్రే జీవోలు కేంద్రం నుండి తెచ్చుకుంటున్నప్పుడు గత పది సంవత్సరాలుగా విన్నవించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఉపాధ్యాయులకు ఆగ్రహం తెప్పించింది.

) అప్రెంటిస్ విధానం రద్దు : అప్రెంటిస్ విధానం అంటే కొత్తగా ప్రాథమిక పాఠశాలలో చేరిన ఉపాధ్యాయుడు మొదటి సంవత్సరం 1800రూపాయలు, రెండవ సంవత్సరం 2400రూపాయలు పొందుతారు. తర్వాతి సంవత్సరంలో మాత్రమే స్కేలు(నిజమయిన జీతం) ఇస్తారు. అంటే మొదటి రెండు సంవత్సరాలు వెట్టిచాకిరి చెయ్యాలన్నమాట. విధానం సరియైనది కాదని, 1800రూపాయలతో జీవితం వెళ్ళదీయటం కష్టమని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

) ఇప్పటికే అప్రెంటిస్ పీరియడ్ ను పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు అందజేయాలి. ధీనికి ఎప్పుడో ప్రభుత్వం ఒప్పుకుంది కానీ జీ.వోను తీయటంలో తాత్సారం చేస్తున్నది.


అన్నింటికన్నా ముఖ్యమైనది. సమ్మె చేసి పిల్లల్ని కష్టపెట్టడం ఉపాధ్యాయుల ముఖ్య ఉద్దేశ్యం కాదు. ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా సమ్మెలోకి దిగటం అనేది ఇరవైరెండు సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇరవైరెండు సంవత్సరాల తర్వాత సమ్మె చేయవలసిన అవసరం వచ్చింది.

ఇప్పటికయినా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల న్యాయమయిన సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేస్తారని కోరుకుందాం.......
Author: వర్మ
•7:17 AM

మద్యనే మా పాపకు బాసర సరస్వతీ ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాం. పక్కన ఉన్న ఫోటో అక్కడే గుడిలో తీసింది.

మా పాప అస్సలు అల్లరే చేయదు కానీ, ఎందుకో ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరు మ్మో!! మీ పాపనా 'చాలా అల్లరి పిల్ల' అంటారు. తనేమంత అల్లరి చేస్తుందని ?

పక్కింటి లక్కీగాని బొమ్మలు లాక్కొని వస్తుంది అదేం పెద్ద అల్లరి పనా ఏంటి ? ఒకే రకమైన బొమ్మలతో ఆడుకుంటే బోర్ కొట్టదా మరి .. .

తను నీళ్ళతో ఎక్కువగా ఆడదుకాని వాష్ బేషిన్ దగ్గర రోజుకోసారైనా కుర్చీ వేసుకుని గంటసేపు చేతులు కడుగుతుంది పిల్లలన్నాక ఇది సాధారణమే కదా ! కాకపోతే ట్యాంకులో నీళ్ళు, సబ్బు త్వరగా అయిపోతాయి.

కంప్యూటర్ జోలికి ఎక్కువగా వెళ్ళదు కానీ నేనదయినా వర్క్ మద్యలో వదిలి వెళితే మాత్రం తనకు ఇష్టం వచ్చిన కీలు నొక్కేసి నాకు అర్థం కాని ఎర్రర్ తెచ్చిపెడుతుంది తర్వాత నేను కంప్యూటర్ ఎరా చాట్ రూం హెల్ప్ తీసుకోవడమో లేక టెక్నిషియన్ ని పిలవడమో జరుగుతుందనుకొండి ! పిల్లలకు కంప్యూటర్ కూడా అవసరం కదా ...

ఇంక తన తమ్మున్ని ఎంత బాగా చూసుకుంటుందో !! వాడికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని మొఖానకి కాటుక తనే పెడుతుంది కాకపోతే ఆ మొఖం మేముకూడా గుర్తుపట్టలేమనుకొండి. అప్పుడప్పుడు వాడు వెళ్ళే దారికి అడ్డుపడుతుంది బహుషా అటువైపు వెళితే ప్రమాదం అని కాబోలు. వాడు ఏడవడం సాధారణమే కదా. అయినా వాడేం తక్కువనా.. అమ్మ దగ్గర పాలు తాగి వాడి బొమ్మలతో వాడు ఆడుకుంటాడు.

ఇంక నా పుస్తకాల విషయానికొస్తే తనకు నచ్చిన బొమ్మలు, పైన కవర్లు చింపేస్తుంది. నాకు పుస్తకాల కలక్షన్ హాబీ చాలా పుస్తకాలకు పైన అట్టలుండవు అంత మాత్రాన పుస్తకం లోపల ఉన్న మ్యాటర్ ఏమయినా చెరిగిపోతుందా!!

పెద్దవాళ్ళను తిట్టటమేమీ చెయ్యదు కానీ ఒక అయిదారు తెలంగానా తిట్లు మాత్రం నేర్చుకుంది. తనకు మాత్రం కోపం ప్రదర్శిండానికి మాత్రం తిట్లు తెలియటం అవసరమే కదా !!

ఇంక ఫంక్షన్ లకి తనే తయారవుతానంటుంది. ఎవరి పని వారే చేసుకొవడంలో తప్పులేదు కదా! కాకపోతే పౌడర్ తో మేము చూడనప్పుడు ఆడుతుంది. మొఖానికి కొంచెం అంటే చాలా కొంచెం పౌడర్ వేసుకుంటుంది. నమ్మకపోతే క్రింది తన ఫోటో చూసి మీరే చెప్పండి.



ఇంక మమ్మల్నెంత బాగా అర్థం చేసుకుంటుందో! మొన్న బాసరకు వెళ్ళేటపుడు నడుస్తున్న ట్రయిన్ దిగి కురుకురే ప్యాకెట్ తీసుకురమ్మని ఒకటే ఏడుపు సుమారు గంటసేపు తోటి ప్రయాణికులందరు వీళ్ళెప్పుడు దిగిపోతార్రా అని ఎదురు చూసారనుకొండి అది వేరే విషయం ...

ఇంక అన్నం తినేటపుడు మాత్రం అస్సలే ఇచ్చంది ఉండదు. అన్నం ముద్ద నోట్లోకి వెళ్ళగాని పరిశోధన ప్రారంబమవుతుంది. పరిశోధన సుమారు 10నిమిషాల పాటు సాగి రెండవ ముద్ద ఎంట్రీతో ముగుస్తుంది. ముద్ద నోట్లో ఉన్నంత సేపు హనుమంతుడిలా మూతిని ముందుకు చాచి ఉంచుతుంది ...


ఇంకా చాలా ఉన్నాయండీ చెప్పాలంటే ........ మచ్చుకు కొన్ని చెప్పాను ఇప్పుడు మీరయినా చెప్పండి 'మాపాప అల్లరి పిల్లనా' ......

ఎన్ని చేసినా We love Her..... ( చివరిది మాత్రం నిజమండి ..... )
Author: వర్మ
•2:20 AM

మీకు సంక్రమించబోయే గోహత్యా మహాపాతకం నుండి తప్పించుకోవాలంటే కూరగాయల, పండ్ల మిగులు ముక్కలు, మిగిలిన అన్నం, వండిన పదార్థాలు ఇతర ఎలాంటి తినుబండారాలు పాలిథిన్ ప్లాస్టిక్ కవర్లలో వేసి పారవేయకండి. కవర్లలలోని పదార్థాలను తినబోయి ఆవులు కవర్లను మింగి సుమారు 25కిలోల కవర్ నిల్వలు కడుపులో పేరుకుపోయి విషపు గ్యాస్ ఫామ్ అయి కడుపు ఉబ్బి భయంకర వ్యాధులు సోకి నరకయాతనతో ఘోరంగా మరణిస్తున్నాయి. ఇది ఒక రకమయిన ' గోహత్యా ' అని ధర్మశాస్త్రంచే నిర్ధారించబడినది.



Author: వర్మ
•10:46 PM
ఒకతను మెడికల్ షాపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి షాపతనితో ఇలా అన్నాడు . .

కష్టమర్ : ఏమండి వెక్కిళ్ళండీ .. వెక్కిళ్ళు.... కాస్తమందిచ్చి పుణ్యం కట్టుకొండి బాబూ ....

షాపతను : ఆగు ఆగు పైసా ఖర్చులేకుండా మంచి మందు ఇవ్వమంటారా ?

కష్టమర్ : సరే ఏదో ఒకటి త్వరగా ఇవ్వండి ప్లీజ్ . .

షాపతను కష్టమర్ చెంపమీద లాగి ఒక్కటిచ్చి ... ఇలా అన్నాడు ...

షాపతను : క్షమించండి. భమపెడితే వెక్కిళ్ళు పోతాయని చిన్నప్పుడెపుడో మా బామ్మ చెప్పంది అదే మీపై ప్రయోగించాను...ఏమీ అనుకోకండే .....

కష్టమర్ : సరే లేవయ్యా... నీ ఉపాయం బాగానే ఉంది కానీ వెక్కిళ్ళు నాక్కాదయ్యా బాబూ... మా ఆవిడకి ......

షాపతను : ఆ ...............

-----------------------------------------------------------------------------------------------

మీకో సరదా ప్రశ్న................

ప్ర : - 'అందమయిన అబద్దం' అంటే ఎలా ఉంటుంది ?



/


/


/




: - బ్యూటీపార్లర్ నుండి బయటకు వచ్చిన అమ్మాయిలా ............



Author: వర్మ
•2:48 AM
" గాంధీలాంటి మహానుభావుడు రక్తమాంసాలతో ఈ భూమిపై నడిచాడంటే తర్వాత తరాలు నమ్మకపోవచ్చు " అని తన తెలివితేటలతో ప్రపంచాన్నే అబ్బురపరిచిన ఐన్ స్టీన్ మహాశయుడు అన్నారు. ప్రస్తుతం గాంధీని తిట్టటమే ఫ్యాషన్ భావిస్తున్న ఈ తరానికి అతని సేవలు అర్థం కాకపోవచ్చును. ప్రస్తుతం పోలీసుల సహాయం లేనిదే అడుగు ముందుకు వేయలేని ఎం.ఎల్.ఎ లు, ఎంపిలకు అహింసా మార్గంలో గాంధీజీ స్వాతంత్ర్యం తెచ్చాడంటే అవహేళనగా అనిపించవచ్చును. దురష్టకరమైన విషయం ఏమిటంటే భావితరాలకు మహాత్ముని గొప్పతనాన్ని బోధించాల్సిన ఉపాధ్యాయయులే తప్పుచేస్తున్నారు. అటువంటి వారికందరికీ ఆ మహాత్ముడు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటూ... గాంధీజయంతి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు.
Author: వర్మ
•2:01 AM
మనం నోట్ ప్యాడ్ ను గానీ, పేజ్ మేకర్, కాలిక్యులేటర్ వంటి కొన్ని ప్రోగ్రాములు ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూలోకి వెళ్ళి వాటిని సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది లేదా డెస్క్ టాప్ పై వాటి షార్ట్ కట్లను ఉంచవలసి వస్తుంది. కానీ .. తక్కువ సమయంలోనే వాటిని తెరవడానికి మనం 'రన్' ను వాడుకోవచ్చును. రన్ ను స్టార్ట్ మెనూ నుండి తెరవవచ్చు లేదా (విండోస్ బటన్+Rను) ప్రెస్ చేసి కానీ తెరవవచ్చును. కీబోర్డ్ పై (విండోస్ బటన్+Rను) ప్రెస్ చేసి రన్ విండోలో cmdఅని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కమాండ్ విండో ప్రత్యక్షమవుతుంది. అలాగే pm65అని ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే పేజ్ మేకర్ తెరుచుకుంటుంది. అలాగే winwordఅని ప్రెస్ చేస్తే విండోస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. calcఅని ప్రెస్ చేస్తే కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. అలాగే ఎక్సెల్ కొరకు excelఅనీ, నోట్ ప్యాడ్ కోరకు notepadఅనీ రన్ లో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయటం ద్వారా వాటిని సులభంగా తక్కువ సమయంలో అవసరమైన కొన్ని ప్రోగ్రాములను తెరవవచ్చును. ప్రయత్నించండి .....